మహేష్‌బాబు, పూరీలబిజినెస్‌మేన్ మొదలైంది

అంతకు ముందున్న బాక్సాఫీస్ రికార్డులకు ‘దిమ్మతిరిగి మైండ్ బ్లాక్’ అయ్యేలా చేసిన సినిమా మహేష్-పూరి జగన్నాథ్‌ల ‘పోకిరి’. ఆ సినిమా సృష్టించిన సంచలనం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మళ్లీ ఆ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ రూపొందుతోన్న చిత్రమే ‘బిజినెస్ మేన్’. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సంస్థ కార్యాలయంలో యూనిట్ సభ్యుల మధ్య సోమవారం మొదలైంది. దేవుని పటాలపై ముహూర్తపు దృశ్యాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ -‘‘ఈ కథ విన్నప్పట్నుంచీ ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళుతుందా అని ఆతృతతో ఎదురుచూశాను. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌ని అంతగొప్పగా తీర్చిదిద్దారు పూరి. మళ్లీ ‘పోకిరి’ లాంటి సెన్సేషన్ హిట్ తర్వాత ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది.

మా కాంబినేషన్ అంటే.. ఎక్స్‌పెక్టేషన్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని రీచ్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘బిజినెస్‌మేన్’ కోసం అభిమానులతో పాటు నేను కూడా ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్నాను. అంటే... ఈ కథపై నేను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నా డెరైక్షన్‌లో వచ్చిన సినిమాల్లోని హీరో పాత్రలతో పోలిస్తే... ఇందులోని హీరో క్యారెక్టరైజేషన్ బెస్ట్. అది రేపు తెరపై మీరే చూస్తారు. లవ్, యాక్షన్ ప్రధానంగా సాగే సినిమా. వెంకట్‌గారు లాంటి డైనమిక్ ప్రొడ్యూసర్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 1న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు.

నిర్మాత వెంకట్ మాట్లాడుతూ -‘‘బిజినెస్‌మేన్’ స్టోరీలైన్ సూపర్బ్. మహేష్‌ని ప్రేక్షకులు, అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాంటి క్యారెక్టరైజేషన్‌తో ఇందులో మహేష్ కనిపిస్తారు. అత్యున్నత సాంకేతిక విలువలతో స్టైలిష్‌గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కాజల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కో-డెరైక్టర్: విజయ్‌రామ్‌ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates